
హైదరాబాద్, వెలుగు: పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ జీవితాంతం సెక్యులరిస్టుగా ఉన్నారని, అలాంటి నాయకుడి విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ వాది అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించడం ఏమిటని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆదివారం గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను డీఎస్ ఏనాడూ అంగీకరించలేదని, అలాంటి నేత విగ్రహాన్ని అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరించడం సరికాదన్నారు.
డీఎస్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందని, కానీ కాంగ్రెస్ నేతలను ఈ ప్రోగ్రాంకు ఆహ్వానించకపోవడం విచారకరమన్నారు. డీఎస్ కొన్ని కారణాలతో బీఆర్ఎస్ లోకి వెళ్లారని.. కానీ ఏనాడూ బీజేపీలో చేరలేదన్నారు. అందుకే ఆయన విగ్రహాన్ని బీజేపీ నేత ఆవిష్కరించడం సరికాదన్నారు. డీఎస్ వద్ద తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని చెప్పారు. పార్టీ నేత కొండా మురళీ ఇచ్చిన ఫిర్యాదు పార్టీ క్రమ శిక్షణ కమిటీ పరిధిలోని అంశమని, ఆ కమిటీ చైర్మన్ కు ఓపిక, సహనం ఎక్కువ అని.. ఆయనే దాన్ని పరిష్కరిస్తారని అన్నారు.
డీఎస్ ఎప్పుడూ బీజేపీ వైపు చూడలే: పొన్నం
పుట్టుకతో కాంగ్రెస్ వాది అయిన డీఎస్ విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ వాది అయిన అమిత్ షా ఆవిష్కరించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. కొడుకుల కారణంగా డీఎస్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. అర్వింద్ ఆయన కొడుకు అయినప్పటికీ, విగ్రహావిష్కరణలో ఆయన తీరు ఏమాత్రం బాగాలేదన్నారు. డీఎస్ కొన్ని కారణాలతో బీఆర్ఎస్ లోకి వెళ్లినా, మళ్లీ పార్టీలోకి వచ్చారు తప్ప.. ఏనాడూ బీజేపీ వైపు చూడలేదన్నారు.
ఆయన జీవితాంతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. సెక్యులరిస్టు అయిన డీఎస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించడం ఆయన్ను అవమానించడమేనని అన్నారు. ఈ ప్రోగ్రామ్ కు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించకపోవడం సైతం సరికాదన్నారు.